కల్నల్కు కన్నీటి నివాళులు..
దేశ రక్షణ కోసం ప్రాణాలు ధారపోసిన కల్నల్కు ప్రజలు కన్నీటితో నివాళులు అర్పించారు. అమర్ రహే అంటూ నినదించారు. భారత్ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో గురువారం ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్ రెజిమెంట్ బృందం పాల్గొంది. కరోనా వల్ల పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలను అంత్యక్రియలకు అనుమతించారు.
అంతకుముందు విద్యానగర్లోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు కొనసాగింది. సంతోష్ బాబును కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సంతోష్ బాబు .. అమర్ రహే, వందే మాతరం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ ప్రజలు భవనాలపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి బంద్ పాటించారు. కల్నల్ కు తుది వీడ్కోలు పలికిన వారిలో పలువురు నేతలు ప్రభుత్వాధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంతోష్బాబు అంత్యక్రియలకు హాజరయ్యారు.













