బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం: అనంత యువతికి ఉచిత వైద్యం
– జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. !
హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద సంభవించిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లాకు చెందిన యువతికి ఉచితంగా వైద్య చికిత్సను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీనికి అవసరమైన ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేయాలని వైఎస్ జగన్.. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి సూచించారు. స్వయంగా ఆయన ఫోనులో మాట్లాడారు.
బస్ స్టాప్ లో నిల్చుని ఉండగా..
గాయపడ్డ యువతి పేరు కుబ్రా బేగం. వయస్సు 23 సంవత్సరాలు. ఆమె తండ్రి అబ్దుల్ అజీమ్ దినసరి వేతన కూలి. పెయింటర్ గా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అతి వేగంగా ప్రయాణిస్తూ అదుపు తప్పిన ఓ కారు కిందికి పడిన ఘటనలో కుబ్రా బేగం తీవ్రంగా గాయపడ్డారు. బస్ స్టాప్ లో వేచి ఉన్న ఆమెకు సమీపంలో కారు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె గచ్చీబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రూ. 5 లక్షలకు పైగా ఖర్చు..
కుబ్రా బేగం వైద్య ఖర్చుల కోసం కనీసం అయిదు లక్షల రూపాయలు వ్యయం అవుతాయని డాక్టర్లు వెల్లడించారు. పేద కుటుంబానికి చెందిన అబ్దుల్ అజీజ్ ఆ ఖర్చును భరించలేనని వెల్లడించారు. ఆసుపత్రి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కుబ్రా బేగం తీవ్రంగా గాయపడటం, ఆసుపత్రి ఖర్చులను భరించే స్థోమత లేని కుటుంబం కావడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి చేరింది. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన.. ప్రభుత్వం తరఫున వైద్య ఖర్చులను భరించడానికి ముందుకొచ్చారు.
అనంత వెంకట్రామి రెడ్డికి ఫోన్..
ఈ సమాచారం తన దృష్టికి వచ్చిన వెంటనే జగన్ స్పందించారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో ఫోనులో మాట్లాడారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కుబ్రా బేగానికి వైద్య చికిత్సను అందించడానికి అవసరమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని చెప్పారు.
హైదరాబాద్ ఆసుపత్రి డాక్టర్లను సంప్రదించిన అధికారులు.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందిన వెంటనే అనంతపురం జిల్లా వైద్యాధికారులు గచ్చిబౌలి ఆసుపత్రి డాక్టర్లను సంప్రదించారు. కుబ్రా బేగం వైద్య చికిత్స కోసం అవసరమైన ఖర్చును ఏపీ ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. బాధితురాలికి వెంటనే శస్త్ర చికిత్స చేయాలని కోరారు. ఇదే విషయాన్ని బాధితురాలి తండ్రి అబ్దుల్ అజీజ్ కు కూడా తెలియజేశారు. తన కుమార్తె వైద్య చికిత్స ఖర్చు కోసం ఏకంగా ఏపీ ముఖ్యమంత్రే జోక్యం చేసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.













