సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ డైరెక్షన్ ప్రకారమే.. యాత్రపై
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ డైరెక్షన్ ప్రకారమే ప్రజా సంగ్రామ యాత్రపై దాడులు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై దాడిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, దాడులు చేస్తారని ముందే సంజయ్ చెప్పారన్నారు. బీజేపీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ బండి సంజయ్ ప్రజలకు భరోసా కలిగిస్తున్నారని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాల్సింది పోయి ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ దాడులు కేసీఆర్ రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. అన్నిరంగాల్లో విఫలమైన ముఖ్యమంత్రి ప్రజాగ్రహాన్ని ఎదుర్కోలేక తమ కిరాయి గుండాలతో దాడి చేయించడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడికి రక్షణ కల్పించలేని వాళ్లు సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఈ ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













