ఈ నెల 30 తర్వాత దానిపై ప్రతీకారం : ఈటల
తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయే అని హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఈటల మాట్లాడారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై ఈటల స్పందిస్తూ తాము కళ్లు తెరిస్తే మాడి మసైపోతారని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది బీజేపీయే అని అన్నారు. ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్నందున తామేమీ మాట్లాడటం లేదని ఈ నెల 30 తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారో దానిపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.
హుజూరాబాద్కు దళితబంధు, పెన్షన్లు సహా ఇతర పథాకాలు రావడానికి తానే కారణమని అన్నారు. నాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ప్రజలు ఓటేయలేదని, తెచ్చిన పార్టీని గెలిపించారన్నారు. ఇప్పుడు కూడా పథకాలు ఇస్తోంది కేసీఆర్ అయినా తెచ్చింది మాత్రం తానేనని ఈటల వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.













