బీఆర్ఎస్ వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల చూపు?
తెలంగాణ రాజకీయాల్లో ‘గులాబీ’ గూడు వదిలి ‘హస్తం’ గూటికి చేరిన పదిమంది ఎమ్మెల్యేల ఆశల హరివిల్లు క్రమంగా ఆవిరవుతోందా? అధికార పార్టీలో చేరితే నియోజకవర్గాలకు నిధుల వరద పారుతుందని, పెండింగ్ సమస్యలన్నీ చిటికెలో పరిష్కారమవుతాయని భావించిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పుడు అసలు సీన్ బోధపడుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటుతున్నా అభివృద్ధి పనులు పట్టాలెక్కకపోవడం, కాంగ్రెస్ అగ్రనేతల వైఖరితో విసుగుచెందిన పలువురు ఎమ్మెల్యేలు.. ఇప్పుడు తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలు రాష్ట్ర రాజకీయాన్ని తీవ్రంగా వేడెక్కిస్తున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచి, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్న పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ప్రధానంగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల కామారెడ్డి జిల్లా బీర్కూరు ఆత్మీయ సమావేశంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత కలహాలను బహిర్గతం చేశాయి. “నేను మంత్రి పదవి కోసమో, నిధుల కోసమో పార్టీ మారలేదు.. కేవలం బాన్సువాడ అభివృద్ధి కోసమే వచ్చా. కానీ, ఆరు నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు కావడం లేదు” అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చివరికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఫోన్లు ఎత్తడం లేదని ఆయన చేసిన ఆరోపణలు ప్రభుత్వంలో ఫిరాయింపుదారులకు దక్కుతున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి.
కేవలం పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రమే కాదు, పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్న చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరినప్పటికీ, ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని, గత పాలనను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సోదరుడు బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసి మంచి ఫలితాలు సాధించడం, గూడెం ‘ఘర్ వాపసీ’కి సంకేతంగా భావిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిలు సైతం తమ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఒకవైపు పాత కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత, మరోవైపు నిధుల లేమితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు కీలక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జోరందుకుంది.
అధికార పార్టీ కండువా కప్పుకున్న వేళ కనిపించిన ఉత్సాహం ఇప్పుడు ఆవిరైపోయింది. సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు ముఖం చూపించలేక ఈ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అసంతృప్తులను చల్లార్చి వారిని తమతోనే ఉంచుకుంటారా? లేక ఈ ఎమ్మెల్యేలు పాత గూటికే ప్రయాణమై తెలంగాణ రాజకీయంలో మరో పెద్ద ప్రకంపన సృష్టిస్తారా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.








