పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేకపోతే… వీటికి ఎక్కడి నుంచి తెస్తారు
సరసమైన ధరలకు ఇళ్ల పట్టాల పేరుతో మరో పథకానికి ఆంధప్రదేశ్ ప్రభుత్వం సిద్ధపడుతోందని, మరో భూ దందా కోసమే దీన్ని చేపడుతున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో లే అవుట్లు అభివృద్ధి చేసి ఇస్తామనడంలో దందా కోణం ఉన్నట్లుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టూ వీలర్స్ ఇస్తామంటున్నారని, పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేకపోతే వీటిని ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పశువులకు అంబులెన్స్ అంటూ మరో పథకం పెట్టారని, దానికంటే పశువైద్యులకే టూ వీలర్స్ ఇచ్చి అక్కడికి పంపితే బాగుంటుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేసుకుంటున్నారని ఆక్షేపించారు. సర్పంచ్ల అధికారాలను లాక్కొంటున్నారని విమర్శించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి ఎన్నో ప్రయత్నాలు చేసినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లారన్నారు.













