ప్రశ్నించొద్దు..కలసి రండన్న పవన్..
జెండా సభ ద్వారా పవన్ ప్రత్యర్థులకు, తనను వెనక్కు లాగేవారికి పక్కాగా క్లారిటీ ఇచ్చారు. చీటికి,మాటికీ ప్రశ్నించడం కాదు.. వెనక్కు లాగడం కాదు.. అండగా నిలబడండి అంటూ పవర్ పక్కాగా చెప్పేశారు.అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది. దాంతో పవన్ ను ఉద్దేశించి రెండు లెటర్లు టక్కున రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మాజీ మంత్రి హరిరామ జోగయ్యది అయితే… మరొకటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) రాశారు. ఇద్దరూ కూడా తాము ఎందుకు లెటర్లు రాస్తున్నామో చెబుతూ.. పరోక్షంగా పవన్ కల్యాణ్ కు ఓ దండం పెట్టేశారు.
టీడీపీ – జనసేన పొత్తులపై గత కొంతకాలంగా లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు… మాజీ మంత్రి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే 60 సీట్లు, రెండున్నరేళ్ళు సీఎం అయ్యేలా ఒప్పందం చేసుకోవాలని పవన్ కు సూచించారు. ఏయే సీట్లు తీసుకోవాలో కూడా సూచిస్తూ లెటర్లు రిలీజ్ చేశారు. నువ్వు తక్కువ సీట్లు తీసుకుంటే దెబ్బయిపోతావ్… నువ్వు అన్ని తీసుకో… ఇన్ని తీసుకో… ఇవి తీసుకో అంటూ పవన్ కు జోరిగలాగా తయారయ్యారు హరిరామ జోగయ్య. ఆయనే కాకుండా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నుంచి కూడా ఇలాంటి ప్రెజరే పవన్ ఎదుర్కొన్నారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… తాడేపల్లిగూడెం సభలో ఈ లెటర్లు రాసేవారికి, సలహాలు ఇచ్చేవారికి గట్టి వార్నింగే ఇచ్చాడు. నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అవసరం లేదు… పోరాటానికి యువరక్తం ఉన్న యూత్ కావాలన్నారు. ఇప్పుడు రణానికి సిద్ధమయ్యామన్న పవన్.. ప్రశ్నించడం కాదు పోరాడేవాళ్లు కావాలని తేల్చేశారు. 24 సీట్లు తీసుకున్నా… బలిచక్రవర్తిని వామనుడు తొక్కినట్టు జగన్ ను తొక్కుతానని ఛాలెంజ్ చేశారు.
సలహాలు ఇవ్వొద్దని ఎవర్ని అన్నాడో… పెద్దాయన హరిరామ జోగయ్యకు క్లియర్ గా అర్థమైంది. అందుకే మూడంటే మూడు ముక్కల్లో మరో లెటర్ రాశారు. నా సలహాలు ఇద్దరు నేతలకు ఇష్టం లేనట్టుంది… మీ బాగు కోసమే చెప్పా… మీ ఖర్మ… మీకోదండం అన్నట్టుగా లెటర్ రాశారు. ఆ తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా బహిరంగ లెటర్ రిలీజ్ చేశారు. పవన్ కోసం తాను ఎదురు చూశాననీ… అయినా మీరు రావడం మీ చేతిల్లో లేదు.. చంద్రబాబు పర్మిషన్ తీసుకోవాలి కదా అనే అర్థం వచ్చేలా ఘాటైన లెటర్ రాశారు. అంతేకాదు..జనసేన పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు… రాకూడదనే కోరుకుంటున్నా అని ముద్రగడ లెటర్లో తెలిపారు. 80 అసెంబ్లీ సీట్లు, 2యేళ్ళ సీఎం పదవిని పవన్ అడగాల్సి ఉంది. ఆయన ఆ సాహసం చేయకపోవడం బాధాకరం… గతంలో జరిగిన అవమానాలు మర్చిపోయి మీతో కలసి పనిచేయాలనుకున్నానంటూ… పవన్ కు రాసిన లెటర్లో వివరించారు ముద్రగడ.
అసలు చంద్రబాబుకు పరపతి పెరగడానికి పవన్ కల్యాణ్ కారణమనీ… ఆయన జైల్లో ఉన్నప్పుడు మద్దతు ఇవ్వడం వల్ల బాబుకి సానుభూతి పెరిగినట్టు తెలిపారు. పవన్ ను జనం ఉన్నత స్థానంలో చూడాలని అనుకుంటున్నారని ముద్రగద తన లెటర్లో తెలిపారు. రెండు నెలల క్రితమే ముద్రగదను పవన్ కల్యాణ్ కలవాల్సి ఉంది. ముద్రగడ తనతో పాటు తన కొడుక్కి జనసేనలో టిక్కెట్టు డిమాండ్ చేయడం పవన్ కు ఇబ్బందిగా మారింది.













