ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించండి : మంత్రి లోకేష్
కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఆపరేషన్స్) టే హన్ లీ (Mr. Tae Hun Lee), ఇతర ఉన్నతస్థాయి బృందంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కియా మోటార్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన పీబీవీ వాహనాలతో సహా ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసి, ఏపీలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరారు. ప్రపంచ మార్కెట్లకు సేవలందించడానికి విశాఖపట్నం పోర్టు సమీపంలో ఒక సీకేడీ అసెంబ్లింగ్, ఎక్స్ పోర్ట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి. E-GMP ప్లాట్ఫామ్ కాంపోనెంట్లు, బ్యాటరీ సిస్టమ్లు, EV ఛార్జింగ్ ఎలక్ట్రానిక్స్ కోసం ఒక EV-కాంపోనెంట్ల తయారీ కేంద్రాన్ని స్థాపించండి. పవర్ట్రెయిన్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వెహికల్ హోమోలోగేషన్ కోసం ఒక EV పవర్ట్రెయిన్ టెస్టింగ్ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఆపరేషన్స్) టే హన్ లీ మాట్లాడుతూ… కియా మోటార్స్ ఇండియాలో 2017లో అనంతపురంలో స్థాపితమై 2019లో భారీస్థాయి ఉత్పత్తి ప్రారంభించిందని తెలిపారు. కియా మోటార్స్ ప్రయాణీకుల, వాణిజ్య, వినోద వాహనాల తయారీతోపాటు “ప్లాన్ ఎస్”, ప్లాట్ఫామ్ బియాండ్ వెహికల్ (PBV) ఇనీషియేటివ్, ఈవీ (EV), అటానమస్ మొబిలిటీని అభివృద్ధి చేస్తోందని తెలిపారు. మాతృసంస్థ హ్యందయ్ మోటార్స్ తర్వాత దక్షిణ కొరియాలో రెండో అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థగా కియా మోటార్స్ అవతరించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ ప్లానింగ్) యూయ్ చుల్ జియోంగ్ (Mr. Eui Chul Jeong), సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఆపరేషన్స్) సాంగ్ ఉన్ చో (Mr. Sang Un Cho), వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ ఆపరేషన్స్) హీ సామ్ కిమ్ (Mr. Hee Sam Kim), వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఆపరేషన్స్) టే కున్ యాంగ్ (Mr. Tae Kun Yang), కియా ఇండియా సీనియర్ లీగల్ అడ్వయిజర్ జుంగో యాన్ (Mr. Jungho An), ప్రిన్సిపల్ అడ్వయిజర్ సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.








