ఏపీలో డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
శాంసంగ్ సీనియర్ డైరెక్టర్ హెలెనా పార్క్ తో మంత్రి లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (సౌత్ కొరియా) సీనియర్ డైరెక్టర్, అపాక్ ఎంఎక్స్ బిజినెస్ హెడ్ శ్రీమతి హెలెనా పార్క్ (Ms.Helana park), డైరెక్టర్ బి టూ బి బిజినెస్ హీసూ యాంగ్ (Mr.Heesoo yang), ఎంటర్ ప్రైజ్ బిజినెస్ గ్లోబల్ సేల్స్ హెడ్ వీపీ జున్ (VP Jun)లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏపీలోని డేటా-సెంటర్ పైప్లైన్ను కేంద్రంగా చేసుకుని, డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన ఫుల్ ఏఐ-కంప్యూట్ స్టాక్ కోసం ఏపీని శాంసంగ్ భారతదేశ స్థావరంగా మార్చాలని కోరారు. అష్యూర్డ్ గ్రీన్ పవర్, సిద్ధంగా ఉన్న భూమి, సింగిల్-విండో క్లియరెన్స్లతో ఏపీలో ఏఐ-రెడీ హైపర్స్కేల్ డేటా సెంటర్లను సంయుక్తంగా అభివృద్ధి చేయండి. ఏపీలో ఏఐ-సర్వర్ తయారీని స్థానికీకరించి, దానికి అనుబంధంగా ఒక లోకల్ సర్వర్ సర్వీసింగ్, పునరుద్ధరణ హబ్ ఏర్పాటు చేయండి. ఏపీలో ఒక డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించండి. ఇందుకు ఐఎస్ఎం 2.0, ప్రత్యేక సెమీకండక్టర్ & డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ ద్వారా మద్దతునిస్తాం. విశాఖపట్నంలోని ఐఎస్ఎం ఓఎస్ఏటీ క్లస్టర్ కేంద్రంగా ఏపీలో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ కోసం ఒక ఓఎస్ఏటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
రాష్ట్ర పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహానికి అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్లో మొబైల్, డివైస్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ లోని 133-క్యూబిట్ IBM క్వాంటం సిస్టమ్ టూపై పరిశోధన చేయడానికి, శాంసంగ్ ఆర్&డీ విభాగాన్ని అమరావతి క్వాంటం వ్యాలీలోకి తీసుకురావాలని కోరారు. అమరావతి రాజధాని నగరం, పారిశ్రామిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో అవకాశాలను అన్వేషించడానికి శాంసంగ్ హెవీ ఇంజనీరింగ్, దుగరాజపట్నంలో ఒక నౌకా నిర్మాణ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్ నిపుణులను నియమించండి. కంపెనీ అవసరాలకు అనుగుణంగా భూమి, సింగిల్-విండో క్లియరెన్స్, విధానపరమైన మద్దతును అందిస్తూ, శాంసంగ్ తన బహుళ విభాగాలకు నిలయంగా ఉండే డెడికేటెడ్ శాంసంగ్ సిటీని నిర్మించాలని మంత్రి లోకేష్ కోరారు. శాంసంగ్ సీనియర్ డైరెక్టర్ హెలెనా పార్క్ స్పందిస్తూ… ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థ ఉన్నతస్థాయి బృందం దృష్టికి తీసుకెళ్లి, నిర్ణయం తీసుకుంటామని అన్నారు.








