ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ?
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనుందా? 13 జిల్లాలు కాస్తా 25 జిల్లాలుగా మారనున్నాయా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. త్వరలో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తథ్యం అని తెలుస్తోంది. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ నోట కొత్త జిల్లాల ఏర్పాటు మాట వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన సృష్టంగా వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. కాగా ముఖ్యమంత్రి సూచనల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు.
ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికల అనంతరం ఏర్పడిన సీఎం జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. సీఎం జగన్ గతంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రాధాన్యతపై అధికారులతో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు తథ్యం అని అంతా అనుకున్నారు. వివిధ కారణాల చేత ఆ నిర్ణయం ఆలస్యమైంది. తాజాగా మరోసారి జిల్లాల పెంపు అంశం తెరపైకి వచ్చింది.













