ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దూకుడు..!
ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన వందల కోట్ల మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా నాంపల్లి ప్రత్యేక కోర్టు అనుమతితో కీలక నిందితులైన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు రాజ్ కేసీ రెడ్డి, మరియు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్లను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.
ముగ్గురు నిందితులను ముఖాముఖి కూర్చోబెట్టి వేర్వేరుగా విచారిస్తూ నిధుల మళ్లింపు గుట్టును విప్పుతున్నారు. ఈ మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపులో క్షేత్రస్థాయిలో భారీగా మనీలాండరింగ్ మరియు హవాలా మార్గాల్లో నిధుల బదిలీ జరిగినట్లు ఈడీ దర్యాప్తులో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మొత్తం కుంభకోణంలో రాజకీయంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అయిన రాజ్ కేసీ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీకి నమ్మకస్తులైన, అనుకూలమైన వారికి మాత్రమే మద్యం రవాణా కాంట్రాక్టులు దక్కేలా టెండర్ నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేశారని గుర్తించింది.
దీని ద్వారా సదరు సిండికేట్ భారీగా లబ్ధి పొందిందని ఈడీ తన దర్యాప్తులో తేల్చింది. మద్యం రవాణా టెండర్లను దక్కించుకోవడానికి ‘సిగ్మా సప్లయి చైన్ సొల్యూషన్స్’ అనే సంస్థను ఒక ఫ్రంట్ (బినామీ) కంపెనీగా ఉపయోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. రవాణా ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో ఏకంగా 95 నుండి 96 శాతం నిధులు నేరుగా ఈ సిండికేట్ ఖాతాల్లోకే వెళ్లాయని, కేవలం 4 శాతం మాత్రమే సదరు కంపెనీకి చూపించారని ఈడీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రేట్లు పెంచేసి ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 195.33 కోట్ల మేర నష్టం కలిగించారని, అందులో ఒక మాజీ మంత్రి కుటుంబానికే రూ. 15 కోట్ల వరకు బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా చేరాయని ఆధారాలు సేకరించారు.








