ప్రజలకు చంద్రబాబు హెచ్చరిక
ఏపీ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు హెచ్చరిక చేశారు. ఈ నెల 18 – 20 తేదీల మధ్య తుపాను వస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఈరోజు నీరు-ప్రగతి, వ్యవసాయంపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే తుఫాన్ పై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేశారు.
రాష్ట్రంలో కొంచెం ఆలస్యంగానైనా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. భూగర్భ జలమట్టం కూడా 5.5 మీటర్లు పెరిగింది. జలకళతో రైతులంతా సంతోషంగా ఉన్నారని బాబు అన్నారు. చెక్ డ్యాముల నిర్మాణం, పంట కుంటల తవ్వకాలను వేగవంతం చేయాలని అధికారులని ఆదేశించారు. మన సంకల్పం మంచిదైతే, ఫలితాలు కూడా మంచిగానే ఉంటాయి. ఇందుకు సమర్థ నీటి నిర్వహణ, నీరు-ప్రగతి, జలసంరక్షణ కార్యక్రమాలే నిదర్శనమని సీఎం తెలిపారు.
గతంలో ఏపీలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ముందు చూపు, నష్టనివారణ చర్యలతో తక్కువ నష్టంతో బయటపడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకొన్నారు. ఈసారి కూడా ప్రజలకు ముందస్తు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, అధికార యంత్రాంగం ముంపు ప్రజలని సురక్షిత ప్రాంతాలకి చేర్చే పనిలో ఉంది.













