దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే ఎక్కువ
దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఆంధ్రప్రదేశ్లోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్నారు. సోలార్, విండ్ పవర్ తీసుకువచ్చామని తెలిపారు. జగన్ రెడ్డి అంతా నాశనం చేశారని ధ్వజమెత్తారు. బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.













