ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం శుభవార్త
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా జంతలూరులో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. దీనికనుగుణంగానే తాజాగా సెంట్రల్ వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం రూ.902 కోట్ల వ్యయంతో సెంట్రల్ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్ నిర్మించే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు. ఈ వర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. ఈ నిర్మాణానికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.













