రాజధాని అమరావతిపై..ఏపీ హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల పాదయాత్రకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛంగా భూములు ఇచ్చారంటే అమరావతి రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రం కోసం పోరాడడం అంటే కేవలం వాళ్ల కోసం పోరాడడం మాత్రమే కాదని, దేశ ప్రజలందరి కోసం పోరాడడమేనని తెలిపారు. ఆ స్వాతంత్య్రం కేవలం సమరయోధులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని స్పష్టం చేశారు.













