ముసల్మానుల్లో అభద్రతా భావం : హమీద్ అన్సారీ
అభద్రతా భావం ఓ రాజకీయ ప్రచారమే : వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ : పదవీ విరమణ చేయబోతున్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఆయన ఉప రాష్ట్రపతి పదవిలో ఉంటూ ఇచ్చిన చివరి మీడియా ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన పదవీ కాలం శుక్రవారంతో ముగుస్తుంది. తదుపరి ఉప రాష్ట్రపతిగా ఎం వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.
రాజ్యసభ టీవీకి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో హమీద్ అన్సారీ మాట్లాడుతూ అసహనం అంశాన్ని ప్రదాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల వద్ద తాను ప్రస్తావించానని చెప్పారు. ప్రజల భారతీయతను ప్రశ్నించడం ఆందోళనకర విషయమని తెలిపారు. అయితే తాను ప్రధానితో చర్చించిన విషయాలపై గోప్యత పాటించవలసి ఉంటుందన్నారు.
మోదీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని అడిగినపుడు అన్సారీ స్పందిస్తూ ఏ విషయానికైనా వివరణ ఉంటుందని, అదేవిధంగా కారణం కూడా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు తీర్పు గురించి మాట్లాడుకుంటే, వివరణను అంగీకరిస్తే, కారణాలను అంగీకరించినట్లేనని, అదే తార్కిక ప్రాతిపదిక అవుతుందని వ్యాఖ్యానించారు.
ముస్లింలకు వ్యతిరేకంగా వస్తున్న వ్యాఖ్యల ఫలితంగా వారిలో అభద్రతా భావం ఏర్పడిందా? ముస్లింలు భయాందోళనలో ఉన్నారన్న వాదనతో ఏకీభవిస్తారా? అని ప్రశ్నించినపుడు హమీద్ అన్సారీ స్పందిస్తూ అది సరైనదేనని తెలిపారు. దేశంలోని వివిధ వర్గాల ద్వారా తాను విన్నదాన్నిబట్టి వాస్తవమేనన్నారు. తాను బెంగళూరులో, అదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ అంశంపై తెలుసుకున్నదానినిబట్టి, ముసల్మానుల్లో ఆందోళన, అభద్రతా భావాలు నెమ్మదిగా పాకుతున్నాయన్నారు.
తాము కావలసినవాళ్ళం కాదనే భావన ముస్లింలలో మొదలైందా? అని అడిగినపుడు అన్సారీ సమాధానమిస్తూ తాను అంత దూరం వెళ్ళబోనన్నారు. అయితే అభద్రతా భావం ఉందని చెప్పగలనన్నారు. భారతదేశం శతాబ్దాలుగా పరస్పర అంగీకారం, ఆమోదంగల వాతావరణంలో కొనసాగుతున్నదని, దీనికి ఇప్పుడు ముప్పు ఏర్పడిందని చెప్పారు.
జాతీయవాదాన్ని రోజూ చాటుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘నేను భారతీయుడిని, అంతే’’ అన్నారు. సహనం అనేది మంచి లక్షణమేనని, అయితే అది మాత్రమే సరిపోదన్నారు. దాని కన్నా మరో అడుగు ముందుకు వేయాలన్నారు. సహనం నుంచి అంగీకారానికి ఎదగాలన్నారు.
అభద్రతా భావం ఓ రాజకీయ ప్రచారమే : వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ : ‘‘మైనారిటీలు అభద్రతాభావంతో ఉన్నారని కొందరు అంటున్నారు. ఇదంతా రాజకీయ ప్రచారం. యావత్తు ప్రపంచంతో పోల్చినపుడు, మైనారిటీలు భారతదేశంలో అత్యంత సురక్షితంగా, భద్రతతో ఉన్నారు, వారికి అందవలసినది వారు పొందుతున్నారు’’ అని కాబోయే ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
దేశంలో అసహనం పెరుగుతోందన్న అభిప్రాయంతో వెంకయ్య నాయుడు ఏకీభవించలేదు. భారతీయ సమాజం ప్రపంచంలోనే అత్యంత సహనశీలమైనదని, దీనికి కారణం భారతీయులు, భారతీయ నాగరికత అని వివరించారు. సహనం ఉండటం వల్లే ప్రజాస్వామ్యం విజయవంతమైందని తెలిపారు.
పదవీ విరమణ చేయబోతున్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజ్యసభ టీవీకి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. దీనిపై ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు వెంకయ్య నాయుడు సమాధానం చెప్పారు. అయితే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలను చేసేటపుడు ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించలేదు.
ఓ సముదాయాన్ని (కమ్యూనిటీని) ప్రత్యేకంగా చూపించడం వల్ల మిగతా సముదాయాలు మరోవిధంగా పరిగణిస్తాయని వెంకయ్య నాయుడు అన్నారు. అందుకే తాము మనమంతా సమానమేనని చెప్తున్నామని స్పష్టం చేశారు. ‘ఎవరినీ బుజ్జగించేది లేదు, అందరికీ న్యాయం జరగాలి’ అనేది తమ నినాదమని చెప్పారు. మైనారిటీలపై వివక్ష లేదని చరిత్ర రుజువు చేస్తోందన్నారు. మైనారిటీలపై వివక్ష లేకపోవడం వల్ల, వారి ప్రతిభ ఆధారంగా అతి ముఖ్యమైన పదవులతోపాటు రాజ్యాంగ పదవులను కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు.













