ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చా…?

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈవీఎంల పనితీరు, వాటిని హ్యాకింగ్ చేసి, ఫలితాలను తారుమారు చేయొచ్చా, లేదా అన్న విషయాలై లోతైన చర్చే జరుగుతోంది. ఇటీవలి కాలంలో మనదేశంలో ఓడిన పార్టీలు తమ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ ఆరోపణలు గుప్పిస్తూ వచ్చాయి. ఇటీవలే…అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన మస్క్.. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్ను నివారించొచ్చని సూచించారు.
ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివన్న రాహుల్..
హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్లోని ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఉండదు. దీంతో దేశ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు.. ప్రజాస్వామ్యం మిథ్యగా మారి, మోసాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు.
‘‘టెక్నాలజీ అనేది సమస్యల పరిష్కారానికి ఉద్దేశించింది. ఒకవేళ అదే సమస్యలకు కారణమైతే దాన్ని పక్కన పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు వాటి ట్యాంపరింగ్ ముప్పు గురించి బహిరంగంగా చెబుతున్నారు. మన దేశంలో మాత్రం వాటినే ఉపయోగించాలని పట్టుబట్టడం వెనుక కారణమేంటో బీజేపీ స్పష్టం చేయాలి’’ అని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. రానున్న అన్ని ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని ఉద్ఘాటించారు.
ఈవీెఎంలు ట్యాంపరింగ్ కుదరదన్న రాజీవ్ చంద్రశేఖర్
అమెరికాతో పోలిస్తే భారత్లోని ఈవీఎంలను ఏ నెట్వర్క్ లేదా మీడియాతో కనెక్ట్ అవ్వని విధంగా రూపొందించారని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయన ట్వీట్కు ఇప్పటికే బదులిచ్చారు. అయితే.. ఇంటర్నెట్కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను వినియోగించే అమెరికా లేదా ఇతర దేశాల్లో మస్క్ చెప్పిన విషయాన్ని అన్వయించుకోవచ్చని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారత ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్లతో కనెక్టివిటీ ఉండదని, వీటిని రీప్రోగ్రామ్ చేయడం కూడా కుదరదని చెప్పారు.