ఆమెపై అనుచిత వ్యాఖ్యలు.. హిమాచల్ కే అవమానకరం : మోదీ

అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం 1989లో హిమాచల్ప్రదేశ్లోనే ఆమోదించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. రామమందిర నిర్మాణానికి ఇది సంకల్పభూమి అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మండీలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. స్థానిక బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ యువత, ఆడబిడ్డల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఆమెపై కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు మండి, హిమాచల్కే అవమానకరమని, దీనికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలన్నారు. కంగనా మీ గొంతుకగా మారతారని, మండి అభివృద్ధికి పాటుపడతారని హామీ ఇచ్చారు.
గత ఏడాది భారీ వరదలతో హిమాచల్ప్రదేశ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం విడుదల చేసిన నిధులను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమందికే పంచిపెట్టిందని, మిగతా డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తాము అధికారంలోకి వచ్చాక వెలికితీస్తామని మోదీ హామీ ఇచ్చారు.