పట్నా హైకోర్టు సంచలన తీర్పు

బిహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ను 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం, 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. బిహార్ వ్యాప్తంగా కులగణన చేపట్టి ఆ నివేదికను నీతీశ్ ప్రభుత్వం గతేడాది నవంబరులో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అదే సమయంలో విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్ల ను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి. ఆర్థికంగా వెనకబడినవారిని ఉద్దేశించిన 10 శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. ఈ పెంపు తో ఎస్సీలకు 16 నుంచి 20 శాతం, ఎస్టీలకు ఒక శాతం నుంచి రెండు శాతం, ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం ఉన్న రిజర్వేషన్ 43 శాతానికి పెరిగింది. అయితే, ఈ పెంపుపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ తుది తీర్పు వెలువరించింది.