బ్రిటన్ ప్రధానితో మోదీ చర్చలు
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్లో చర్చలు జరిపారు. భారత్ జారీ చేస్తున్న కరోనా టీకా ధ్రువపత్రాన్ని బ్రిటన్ గుర్తించడం, అఫ్గానిస్థాన్లో తాలిబన్లతో అంతర్జాతీయ సమాజం వ్యవహరించాల్సిన తీరు, గ్లాస్గోలో జరగనున్న కాప్-26 సదస్సు వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. కరోనాపై కొనసాగిస్తున్న పోరు, అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతులు వంటివి కూడా నేతలు చర్చించినట్లు వెల్లడిరచింది. కొవిషీల్డ్, లేదా తాము ఆమోదించిన ఇతర వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు భారత్ నుంచి తమ దేశానికి వస్తే 10 రోజులు తప్పనిసరిగా ఏకాంతంలో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత మోదీ, జాన్సన్ మధ్య చర్చలు జరగడం విశేషం.













