కార్పాథియన్ సి8 కూటమి.. మారుతున్న సమీకరణాలు…?
ప్రపంచవ్యాప్తంగా సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధం.. రష్యా-ఉక్రెయిన్ వార్.. మధ్యలో తమపై ఎక్కడ దాడులు జరుగుతాయో అన్న భయంలో యూరోపియన్ యూనియన్…ఇలాంటి తరుణంలో సరికొత్త కూటమి పురుడుపోసుకుంది.అదే కార్పాథియన్ సీ8 కూటమి. దీన్ని ఏర్పాటు చేసింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇందులో ఉక్రెయిన్ తో పాటు మరో ఏడు యూరోపియన్ దేశాలు సభ్యులుగా మారాయి. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ఉక్రెయిన్లోని నైరుతి ప్రాంతమైన ఇవానో-ఫ్రాంకివ్స్క్లో కార్పాథియన్ ప్రాంతానికి చెందిన దేశాల నేతలు, ప్రతినిధులతో జరిగిన సదస్సులో జెలెన్స్కీ ఈ కొత్త వేదికను ప్రకటించారు. ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, భద్రత, ఇంధనం, రవాణా, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచడం C8 ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.
‘C8’లో మొత్తం ఎనిమిది దేశాలు ఉన్నాయి. అవి.. ఉక్రెయిన్, రొమేనియా, సెర్బియా, పోలాండ్,
స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, హంగేరీ ఉన్నాయి. ఈ కూటమి ఏర్పాటుకు సంబంధించిన సదస్సులో యూరోపియన్ యూనియన్ (EU) కూడా పాల్గొంది.
కొత్త ప్రాంతీయ ఫార్మాట్లో భాగంగా సభ్య దేశాలు భద్రత, ఇంధనం, లాజిస్టిక్స్ను గణనీయంగా విస్తరించడం, సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక సహకారం వంటి అంశాలపై కలిసి పనిచేయనున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. స్థానిక ప్రాంతాలు, కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడం కూడా సహకారంలో మరో కీలక అంశంగా ఉంటుందని చెప్పారు. ‘‘ఈ రోజు తొలిసారిగా ఉక్రెయిన్లోని మన కార్పాథియన్ ప్రాంతంలో కార్పాథియన్ దేశాలు, ఆయా దేశాల ప్రాంతాలు, కమ్యూనిటీలను ఒకే సదస్సుకు తీసుకొచ్చాం. ఉక్రెయిన్, దాని యూరోపియన్ పొరుగు దేశాలను, మొత్తం యూరోపియన్ యూనియన్తో కలిసి ఒకే వేదికపైకి తీసుకొచ్చే C8 ఫార్మాట్ను ప్రారంభిస్తున్నాం’’ అని జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ కొత్త కూటమి పేరుకు భౌగోళిక అనుబంధమే ఆధారం. కార్పాథియన్ పర్వత శ్రేణి సుమారు 1,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. పశ్చిమాన చెక్ రిపబ్లిక్ నుంచి తూర్పున రొమేనియా వరకు ఈ పర్వత శ్రేణి విస్తరించి ఉంటుంది. C8లోని పలు దేశాలకు ఈ ప్రాంతంతో ప్రత్యక్ష భౌగోళిక అనుబంధం ఉంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ప్రాంతీయ ఫార్మాట్ ఏర్పాటైంది. దీంతో భద్రత, ఇంధన రంగాలకు ఈ కూటమిలో ప్రత్యేక ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. అదే సమయంలో రవాణా మార్గాలు, సరిహద్దు వాణిజ్యం, ఆర్థిక సహకారం వంటి దీర్ఘకాలిక అంశాలపైనా దేశాలు దృష్టి పెట్టనున్నాయి.
C8 సదస్సుకు హాజరైన పోలిష్ ప్రధాని..
కార్పాథియన్ ఎయిట్ సదస్సుకు పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ కూడా హాజరయ్యారు. ఉక్రెయిన్కు సంఘీభావం ప్రకటించడంతో పాటు కీవ్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు తాను ఉక్రెయిన్కు వచ్చినట్లు టస్క్ తెలిపారు. ప్రతిపాదిత యాంటీ-బాలిస్టిక్ మిసైల్ కూటమిలో పోలాండ్ పాత్రకు సంబంధించిన అంశాలపైనా టస్క్ చర్చించినట్లు సమాచారం. దీంతో C8 సదస్సులో ప్రాంతీయ సహకారంతో పాటు భద్రతా అంశాలకు కూడా ప్రాధాన్యం లభించింది.








