ఏపీలో 7,228 కొత్త కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 72,838 నమూనాలను పరీక్షించగా 7,228 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,46,530కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 45 మంది కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 7, ప్రకాశం 7, కృష్ణా 5, తూర్పుగోదావరి 4, విశాఖపట్నం 4, పశ్చిమగోదావరి 4, అనంతపురం 3, కడప 3, నెల్లూరు 3, గుంటూరు 2, కర్నూలు 2, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 5,506కి చేరింది. 24 గంటల వ్యవధిలో 8,291 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 70,357 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 5,70,667 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53,02,367 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.






