మహాగాయకుడు ఘంటసాల : వందేమాతరం శ్రీనివాస్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 150 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాదాపుగా ఒక సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ ప్రముఖులు 33 దేశాల తెలుగు సంస్థల నాయకులు, తెలుగేతర ప్రముఖులు పాల్గొన్నారని బాల తెలిపారు. గత 6 నెలలుగా రత్నకుమార్(సింగపూర్) ఘంటసాల కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉందని తెలియచేసారు.
ఇందులో భాగంగా యు.యెస్.ఏ. నుంచి ప్రముఖ గాయకుడు, రచయిత ఫణి డొక్క వ్యాఖ్యాతగా 2022 జులై 24న జరిగిన అంతర్జాల కార్యక్రమములో, కార్యక్రమ ముఖ్యఅతిథి నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడు(హైదరాబాద్, తెలంగాణ ఇండియా), వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ అమరగాయకుడు, సంగీత దర్శకుడు, పదివేలకు పైగా పాటలు పాడి భారతదేశం గర్వించతగిన ముఖ్యంగా దక్షిణ భారతదేశం గర్వించతగినటువంటి మహాగాయకుడు ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ఎందరో కళాకారుల ఆకాంక్షతో తానూ ఏకీభవిస్తూ, భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని అన్నారు. ‘‘ఘంటసాల గారికి భారతరత్న ఇవ్వమని… మీరందరు చేసే అభిప్రాయం సేకరణ, ఈ ఉద్యమం ఫలప్రదం కావాలని మనసారా కోరుకుంటూ, మరొక్క సారి భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను’’ అని అన్నారు.
ఘంటసాలగారికి భారతరత్న ఇవ్వమని.. మరొక విశిష్ట అతిథి ప్రముఖ గాయకుడు, నటుడు (హైదరాబాద్, ఇండియా) డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఘంటసాల గురించి మాట్లాడే అర్హత గాని, వారి గాన వైభవాన్ని గురించి చర్చించేంత శక్తి గాని లేదని చెప్పారు. ‘‘కానీ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి గాయకుడిగా, సంగీత విద్వాంసుడిగానే కాకుండా, స్వాతంత్ర సమరయోధుడిగా నేను వారిని భావిస్తున్నాను. వారు కేవలం ఒక సినీ గాయకుడేకాకుండా అనేక సామజిక అంశాల మీద గానం చేశారు. వారి గానం గంధర్వ గానం… ఈరోజు చాలా మంది వారిని అనుసరిస్తున్నారు, అనుకరిస్తున్నారు… అనుకరణకి, అనుసరణకి కూడా అందని ఒక దివ్యమైన మహోన్నత గానం వారిది…వారి చనిపోయి 50 సంవత్సరాలు అయినా కానీ వారి పాటలతో అనేక మంది ఈరోజు వైద్యం కన్నా గొప్ప చికత్సను పొందుతున్నారు… ఈ సందర్భంగా నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఆ మహనీయదుకి భారతరత్న గౌరవం దక్కాలని కోరుకున్నారు..’’ అని అన్నారు.
మరొక విశిష్ట అతిథి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, నంది, మా మ్యూజిక్ అవార్డు గ్రహీత (చెన్నై, ఇండియా) గోపిక పూర్ణిమ మాట్లాడుతూ, మహాగాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వారిని భారతరత్న పురస్కారంతో సత్కరించాలని ఒక ఆశయం కోసం కృషిచేస్తున్న దాదాపు 33 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ‘‘మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో గొప్పది… తెలుగుజాతి రత్నం, తెలుగుజాతి గౌరవం, గర్వం అయినా ఘంటసాల వారిని భారతరత్నతో బిరుదాంకితం చేయడం అన్నది ఎంతో గొప్ప విషయం, వారికి ఈ పురస్కారం దక్కడం మనందరి భాద్యత కూడాను.. అందరి భాద్యతను మీరందరు ముందుండి తీసుకెళ్లడం చాలా అభినందనీయం’’ అని అన్నారు.
మరొక అతిథి నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు (హైదరాబాద్, ఇండియా) సాకేత్ కోమండూరి మాట్లాడుతూ మనందరికీ ఎంతో ఇష్టమయిన మన ఘంటసాల మాస్టారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భారతరత్న పురస్కారం కోసం కృషి చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
కార్యక్రమ గౌరవ అతిధి పీఎస్2సీఎం డాక్టర్ వైఎస్సార్ (2004 నుంచి 2009 వరకు, హైదరాబాద్, ఇండియా) భాస్కర శర్మ మాట్లాడుతూ భగవద్గీత వినగానే వెంటనే గుర్తుకొచ్చేది ఘంటసాల గారు అని చెప్పారు.
సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ. రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ ఇప్పటిదాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న 33 దేశాల సేవలను వారి సహకారానికి ధన్యవాదములు తెలియచేసారు. యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు ఆనంద్ దాసరి (డల్లాస్), రవి రెడ్డి మరకా (నెవార్క్), టిఎఎస్ సి అధ్యక్షుడు రావు కల్వకోట(లాస్ ఏంజిల్స్), అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ రవి, శశికళ పెనుమర్తి (అట్లాంటా), భారతదేశం నుంచి ఆసియా పసిఫిక్ ఇంక్ CEO, సత్యప్రసాద్ సిద్దవటం (హైదరాబాద్, ఇండియా), బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, కోలపల్లి వి.ఆర్. హరీష్ నాయుడు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం. ఘంటసాలకు కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో గురించి భారతరత్న అవార్డుతో సత్కరించాలి’’ అని అందరూ ముక్తకంఠంతో కోరారు.













