ముగ్గురు బీటెక్ విద్యార్థులకు బంపర్ ఆఫర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-రూర్కీ)కి చెందిన ముగ్గురు విద్యార్థులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఏకంగా సంవత్సరానికి 1.54 కోట్ల ప్యాకేజీతో వీరికి ఐఐటీ క్యాంపస్ సెలక్షన్స్లో అమెరికా కంపెనీలు ఆఫర్ ప్రకటించాయి. కేవలం బీటెక్ విద్యార్థులు ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ రావడం ఇదే ప్రథమమని ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ముగ్గురు విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ విభాగాల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇక్కడ జరిగిన క్యాంపస్ సెలక్షన్స్లో వీరిని ఎంపిక చేయగా.. మరో విద్యార్థి 62 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎంపికయ్యారు. 30 అమెరికన్ ఎంఎన్సీ కంపెనీలు 363 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేయగా 322 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ కంపెనీలు ముగ్గురు విద్యార్థులకు 1.54 కోట్ల ప్యాకేజీతో ఎంపిక చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అని ఐఐటీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా, ఏ కంపెనీలు ఎవరికి ఎంత ప్యాకేజీతో తీసుకొన్నాయో పేర్లు వెల్లడించడానికి రూర్కీ ఐఐటీ వర్గాలు నిరాకరించారు.













