లాక్ డౌన్ పొడిగింపే!
కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఈనెల 14 వరకు విధించిన లాక్డౌన్ తొలి దశను పొడిగించే అవకాశాలున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నది. అనేక రాష్ట్రాలు లాక్డౌన్ని పొడిగించడం మినహా మరో గత్యంతరం లేదని కేంద్రానికి స్పష్టం చేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారంనాడు మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెల్సిందే. బతికుంటే బలుసాకు తినొచ్చునని ప్రాణం పోయాక మళ్లీ తేలేమని ఆయన చేసిన సూత్రీకరణతో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకీభవిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మితంగానే ఉందన్న భావనతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.
అయితే ఉన్నట్టుండి ఢిల్లీ మర్కజ్ యాత్రికుల ప్రవేశంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, సుస్ధిర కార్యాచరణతో వారినందర్నీ కట్టడి చేసి పరీక్షలకు పంపుతున్నారు. అయినా ఇంకా కొద్ది మంది ప్రభుత్వ పరిధిలోకి రాలేదు. వారికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గడువిచ్చి హెచ్చరించాయి. ఈదశలో లాక్డౌన్ ఎత్తేస్తే ఇప్పటిదాకా చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని భావిస్తున్నారు. అందుకే రెండో దశగా ఏప్రిల్ నెలాఖరుదాకా లాక్డౌన్ని పొడిగించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెల్సింది. ఈ కాలంలో అటు కరోనా రోగుల విషయంలో ఎలా వ్యవహరించాలి..మరోవంక లాక్డౌన్ సమయంలో ప్రజలను ఏరీతిన నియంత్రించాలి అన్న కోణంలో సమాలోచనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ఈకోణంలో కేంద్రానికి సలహాలిచ్చినట్టు తెలుస్తున్నది. మొత్తంమీద రాష్ట్రాలు లాక్డౌన్ని కఠినంగా అమలుచేసే విషయంలో ప్రధాని మోడీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెల్సింది. ఈ విషయంలో రూపొందించుకున్న స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం ముందు కెళ్లాలన్నారు..













