2019 ఎన్నికల ప్రచారంలో దిగిన ఎన్నారై టీడిపి
(చెన్నూరి వెంకట సుబ్బారావు)
అమెరికాలో 14 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంగా ఉన్న ఎన్నారై టీడిపికి సమర్థనాయకత్వం, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. దేశంలో జాతీయ పార్టీలకు విభాగాలు ఉన్నా, ఇలా విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించిన చరిత్ర మాత్రం దేనికీ లేదు. అది ఒక్క తెలుగుదేశం పార్టీకే లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తోడుగా నవ్యాంధ్ర ప్రగతికోసం ఎన్నారై టీడిపితోపాటు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఎపిఎన్ఆర్టీ కూడా తీవ్రంగా శ్రమించింది. కాగా గత ఎన్నికల్లో పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన ఎన్నారై టీడిపి ఈసారి కూడా తనవంతుగా ఎన్నికల్లో గెలుపుకోసం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఎన్నారై టీడిపి అగ్రనేత జయరామ్ కోమటి ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు సతీష్ వేమన, కేసి. చేకూరి, లోకేష్ నాయుడు వంటి వాళ్ళు కూడా ప్రచారరంగంలోకి దిగారు. మరికొంతమంది అమెరికా నుంచే టీడిపికి మద్దతుగా ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో చేస్తున్నారు. వెంకట్ కోగంటి, సునీల్ పాంత్రాలాంటి వాళ్ళు ఈ ప్రచారంలో ముందుంటున్నారు.
అమెరికాలో ఎన్నారై టీడిపికి పెద్ద సంఖ్యలో సభ్యులు ఉన్నారు. తాము అమెరికా రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించిన ఐటీ అనుకూలవైఖరినే కారణమని వారు చెబుతారు. ఆయన గెలుపు తమకు ముఖ్యమని ఎన్నారైలు అంటారు. అమెరికా లో 2007 లో కొందరు ప్రముఖులు సమావేశమై తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై ఆలోచించారు. చర్చలు, సమావేశాల తరువాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నారై టీడిపిని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నారై టీడిపి ఏర్పాటు వెనుక తానాలో ఉంటూ, తెలుగుదేశం పార్టీలో చేరిన జయరామ్ కోమటితోపాటు, తానా అధ్యక్షునిగా పనిచేసిన నాదెళ్ళ గంగాధర్ మరియు ఇతర నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయానికి ఎల్లప్పుడూ నిరంతరం పాటుపడుతున్న ఎన్నారై తెలుగుదేశం పార్టీ విభాగం 2007లో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛంద అనుబంధ సంస్థగా దీనిని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉంటున్న ప్రముఖులైన డా. రాఘవేంద్ర ప్రసాద్, డా. నవనీతకష్ణ, డా. కొత్తపల్లి శ్రీనివాస్, పద్మశ్రీ ముత్యాల, ఉదయ్ చాపలమడుగు, శ్రీనివాస్ చందు, లక్ష్మీనారాయణ సూరపనేని, చలమా రెడ్డి, యుగంధర్ ఎడ్లపాటి, బ్రహ్మాజీ, కిషోర్ పుట్టా, డా. హనుమయ్య బండ్ల, హేమప్రసాద్ వంటివారు చంద్రబాబుకు మద్దతుగా ఉంటున్నారు.
ఎన్నారై టీడిపి అమెరికాలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. పార్టీకి మద్దతుగా ఎన్నారైల మద్దతును కూడగట్టేందుకు కృషి చేసింది. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి వంటి కార్యక్రమాలతోపాటు అమెరికాకు వచ్చే పార్టీ నాయకులతో ముఖాముఖీ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. టీడిపి అగ్రనాయకులైన కోడెల శివ ప్రసాద్, గంటా శ్రీనివాసరావు, గరికపాటి మోహనరావు, పల్లె రఘునాధరెడ్డి, బోండాఉమ, ఉమామాధవరెడ్డి, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, నన్నపనేని రాజకుమారి, పయ్యావుల కేశవ్, నారాలోకేష్, ముళ్ళపూడి బాపిరాజు, మురళీమోహన్, చదలవాడ క్రిష్ణమూర్తి, ధూళిపాళ్ళనరేంద్ర, నన్నూరి నరసిరెడ్డి, నారారోహిత్, నందమూరి బాలక్రిష్ణ, సుజనాచౌదరి వంటివారు ఎన్నారై టీడిపి నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం ఎన్నారై టీడిపి తరపున యన్.టి.ఆర్, పరిటాల రవి, యర్రం నాయుడు, మాధవరెడ్డి జయంతి, వర్ధంతి సమావేశాలు, తె.దే.ప ఆవిర్భావ దినోత్సవాలు, మినీ మహానాడులను ఎన్నారై టీడిపి నిర్వహిస్తోంది. ఇదే కాకుండా ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ కు, స్మార్ట్ విలేజ్ కి, జన్మభూమికీ నిధి సేకరణ చేయటం, హుద్ హుద్ తుఫాన్ సేవా కార్యక్రమాల్లో కూడా ఎన్నారై టీడిపి పాలుపంచుకుంది. 2014 ఎన్నికల ముందు సంవత్సరంలో యువతరం ఎన్నారై టీడిపిలో చేరింది. యువత రాకతో ఎన్నారై టీడిపి ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసుతో యువత కలిసి పనిచేయడం ప్రారంభించడంతో ఎన్నారై టీడిపి గురించి రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు బాగా తెలిసింది. రాష్ట్రంలో ఉనికిని చాటడంతోపాటు కొంతమంది అప్పడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఎన్నారై టీడిపి చేసిన బ్రింగ్ బాబు బ్యాక్ ప్రచారం రాష్ట్రమంతటా విస్త తంగా ప్రజల్లోకి చొచ్చుకువెళ్ళింది. డల్లాస్లోని ఎన్నారై టీడిపి నాయకులు ప్రారంభించిన బాబు వస్తే జాబు గ్యారంటీ అన్న ప్రచారం కూడా రాష్ట్రంలోని యువతరాన్ని ఆకట్టుకుంది. ఇలా కొత్త నినాదాలతో, సామాజిక మాధ్యమాలను విస్తతంగా డుకుంటూ ఎన్నారై టీడిపి చేసిన ప్రచారం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా చేసింది.
అమెరికాలో ఉన్న ఎన్నారైలతోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలను ఒకే ప్లాట్ఫామ్ మీదకు తెచ్చేందుకు వీలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎపిఎన్ఆర్టీని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షునిగా అమెరికాలో ఉన్న రవి వేమూరును నియమించింది. ఈ విభాగం ద్వారా వివిధ దేశాల్లో ఎపిఎన్ఆర్టీ కో ఆర్డినేటర్లను నియమించి వారి ద్వారా ఎపి ప్రభుత్వ ఆశయాలను, ప్రభుత్వ పథకాలను విస్త తంగా వ్యాపింపజేసింది. అలాగే ఎన్నారైలకోసం ఎపి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కూడా తెలియజేసింది. ఓవైపు ఎన్నారై టీడిపి, మరోవైపు ఎపిఎన్ఆర్టీ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఎంతోమంది ఎన్నారైలను తెలుగుదేశం పార్టీవైపు చూసేలాచేసింది.
తాజాగా 2019 ఎన్నికల్లో కూడా తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారాన్ని నిర్వహించేందుకు ఎంతోమంది ఎన్నారైలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎన్నారైలు రాష్ట్రానికి వచ్చి టీడిపికి మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించారు. మరికొంతమంది విదేశంలోనే ఉంటూనే టీడీపికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని చేస్తున్నారు. ఎపిఎన్ఆర్టీ ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రగతికోసం చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారరథాలను ఊరూరా తిప్పుతున్నది. ఎన్నారై టీడిపి పార్టీపై, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు తిప్పికొడుతూ ప్రభుత్వం ప్రజలకోసం చేసిన ప్రగతిని, చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఉండే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తోంది. ఇలా ఎన్నారై టీడిపి, ఎపిఎన్ఆర్టీ రెండూ 2019 ఎన్నికల్లో టీడిపి గెలుపుకోసం కృషి చేస్తోంది.













