ఉత్తర కొరియా కీలక నిర్ణయం
దక్షిణ కొరియాతో సైనిక, రాజకీయ పరమైన అన్ని సంబంధాలను తెంచుకుంటాని ఉత్తర కొరియా వెల్లడించింది. తమ శత్రుదేశంతో ఇక ఎంతమాత్రం సంబంధాలు నెరపబోమని ఆ దేశ మీడియా పేర్కొంది. ఇరు ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా సరిహద్దుల్లో కరపత్రాలు పంచుతున్న కార్యకర్తలపై బెదిరింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ మధ్య 2018లో మూడు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాయాది దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన సమసిపోలేదు.
ఈ క్రమంలో దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు కిమ్ నియంతృత్వ పోకడలు, అణ్వాయుధాలపై ఉత్తర కొరియా విధానాలను విమర్శిస్తూ సరిహద్దుల్లో బెల్లూను ఎగురవేశారు. దాంతో పాటు కిమ్ దుయ్యబడుతూ రాయించిన కరపత్రాలు గాల్లోకి విసిరారు. దీంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని వారం క్రితమే హెచ్చరించింది. అంతేకాకుండా ఉభయ కొరియాల పునర్ కలయికకు నిదర్శనంగా నిలిచిన అనుసంధాన వేదికలన్నింటినీ మూసివేస్తామని చెప్పింది.













