MTF: మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం

మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.
కౌలాలంపూర్, సెప్టెంబర్ 1 — మలేసియా యొక్క 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు అనేక తెలుగు సంఘాల భాగస్వామ్యంతో “మెర్దేకా మధుర గీతాంజలి చారిటీ” అనే సాంస్కృతిక కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో దేశభక్తి, సంగీతం, సేవా మనోభావం మిళితమై, మలేసియాలోని తెలుగు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించిన సంఘాలు:
మలేసియా తెలుగు ఫౌండేషన్
మలేసియా-తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్
తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ-మలేసియా
మలేసియా పెళ్లిచూపులు అసోసియేషన్
మరియు, ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేసియా (FNCA) మరియు భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేసియా వంటి ఎన్ఆర్ఐ సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు నిచ్చాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత హైకమిషనర్ శ్రీ బి.ఎన్. రెడ్డి గారు హాజరై, తెలుగు సమాజానికి తన ఆశయాలను పంచుకున్నారు.
గౌరవ అతిథులుగా, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ప్రఖ్యాత నటుడు శ్రీ మురళీ మోహన్ గారు, ప్రముఖ సీనియర్ నటుడు శ్రీ ప్రదీప్ గారు కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
శ్రీ మురళీ మోహన్ గారి సేవల్ని స్మరించుకుంటూ, ఓ స్మరణార్థ వీడియో ప్రదర్శించబడింది, ఇది ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది.
మలేసియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు డాటో కాంతారావు గారు, హైకమిషనర్ బి.ఎన్. రెడ్డి గారిని, శ్రీ మురళీ మోహన్ గారిని, శ్రీ ప్రదీప్ గారిని మరియు అన్ని కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకలో భాగంగా అనాథ పిల్లలకు కృతజ్ఞతాభివందనాలు మరియు బహుమతులు అందజేయడం ద్వారా చారిటీ లక్ష్యాన్ని కూడా నెరవేర్చారు.
ఈ కార్యక్రమములో తెలుగు గాయకుల వినూత్న సంగీత ప్రదర్శనలు మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. దేశభక్తి గీతాలు మరియు సాంస్కృతిక గీతాలతో ప్రేక్షకులను అలరించారు.
FNCA అధ్యక్షుడు బురెడ్డి మోహన్ రెడ్డి గారు, భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా అధ్యక్షుడు చోప్పరి సత్య గారు ఈ వేడుకలో పాల్గొని, సాంస్కృతిక మరియు సామాజిక సేవ అవసరాన్ని ప్రస్తావించారు.
“మెర్దేకా మధుర గీతాంజలి చారిటీ” కార్యక్రమం ఐక్యత, సంప్రదాయం మరియు మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి, మలేసియాలో నివసిస్తున్న తెలుగు సమాజం తమ వారసత్వంపై గౌరవాన్ని, మరియు మలేషియాపై ప్రేమను చాటి చెప్పింది.