ఐఎంఎఫ్ భారీ విరాళం
కరోనా వైరస్ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడమే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నది. చైనా వంటి ఆగ్రదేశం కూడా కరోనా తాకిడితో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కరోనా ప్రభావిత దేశాలకు చేయూత నిచ్చేందుకు సంకల్పించింది. ఈ క్రమంలో 50 బిలియన్ డాలర్ల భారీ ఆర్థికసాయం ప్రకటించింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక పురోగతి గతేడాది కంటే దిగువస్థాయికి చేరిందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా సహా 70కి పైగా దేశాలను కరోనా వణికిస్తోన్న నేపథ్యంలో ఐఎంఎఫ్ ఆర్థికసాయం కాస్తంత ఉపశమనం కలిగించనుంది. తాము ప్రకటించిన ఆర్థికసాయంతో పేద, మధ్య తరహా ఆదాయ దేశాలు ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా తెలిపారు. కరోనా కారణంగా పతనమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితి మున్ముందు ఏ స్థాయికి చేరుతుందన్నది అంచనా వేయలేక పోతున్నామని పేర్కొన్నారు.













