టెక్సాస్ 22వ స్థానం నుంచి తెలుగువ్యక్తి బంగార్ రెడ్డి పోటీ
అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు ఆలూరు బంగార్రెడ్డి పోటీ చేస్తున్నాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్ఏ) కాంగ్రెస్కు టెక్సాస్ రాష్ట్రంలోని టెక్సాస్ 22 స్థానానికి రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం బంగార్రెడ్డి నామినేషన్ వేశారు. జాజిరెడ్డిగూడేనికి చెందిన ఆలూరి రామచంద్రారెడ్డి-సక్కుబాయమ్మల కుమారుడు బంగార్రెడ్డి 25 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో స్థిరపడ్డారు.
అమెరికన్ కాంగ్రెస్ కి పోటీ చేయడానికి గల ముఖ్యమైన కారణాలను వివరిస్తూ, బలమైన కుటుంబ విలువలు, సురక్షితమైన సరిహద్దులు, మాదకద్రవ్యాలు లేని సమాజం, సత్వరమైన చట్టపరమైన వలస విధానం, మరియు అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్య వైద్య సౌకర్యాలు అందించడం కోసం కషి చేస్తున్నట్లు బంగార్ రెడ్డి చెప్పారు. పాతిక సంవత్సరాలుగా ఐటీ రంగంలో నిష్ణాతులుగా ఉన్న ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అందమైన జీవితాన్ని అందించిన అమెరికాకు సేవ చేయడం కర్తవ్యంగా భావిస్తూ, ‘ఐ లవ్ మై అమెరికా’ అనే నినాదంతో రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు బంగార్ రెడ్డి చెప్పారు.













