‘ది ఇండియా స్టోరీ’ పురుగుమందుల సాగులోని చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చిన ట్రైలర్ రిలీజ్
‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ ట్రైలర్ విడుదలైంది. ఇది పురుగుమందుల సాగు అనే ఆందోళనకరమైన సమస్యను, సమాజంపై దాని ప్రభావాలను వెలుగులోకి తెస్తుంది. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, ప్రతి ఇంటిని ప్రభావితం చేస్తున్న కీలక సమస్యను ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన డ్రామా, పవర్ ఫుల్ నటన, సామాజిక సందేశంతో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించారు. సాగర్ బి. షిండే కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
దర్శకుడు చేతన్ డీకే మాట్లాడుతూ...’ది ఇండియా స్టోరీ’ కేవలం ఒక సినిమా కాదు… మనమంతా చర్చించాల్సిన ఒక కీలక అంశం. ప్రతి ఇంటిని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్న సమస్యను ఈ సినిమా ద్వారా వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించాం. నిజం కోసం జరిగే పోరాటం, ధైర్యం, ఆత్మస్థైర్యాన్ని ట్రైలర్లో చూపించాం. ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేయడంతో పాటు, మన చుట్టూ ఉన్న వాస్తవాలపై స్పందించేలా చేస్తుందని ఆశిస్తున్నాను”
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ... ‘ది ఇండియా స్టోరీ’లో భాగం కావడం నాకు ఎంతో గొప్ప అనుభవం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నిజం కోసం పోరాడే పాత్రలో నటించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసే ఆసక్తిని కలిగిస్తుందని నమ్ముతున్నాను”
శ్రేయస్ తల్పాడే మాట్లాడుతూ… ‘ది ఇండియా స్టోరీ’ భావోద్వేగాలే ఈ ట్రైలర్కు ప్రధాన బలం. అసాధారణమైన సవాలును ఎదుర్కొనే ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. ఆశ, ఆత్మవిశ్వాసంతో సాగిన ఆ పోరాటం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. జూలై 24న థియేటర్లలో ప్రేక్షకులు ఈ అనుభూతిని ఆస్వాదించాలని ఎదురుచూస్తున్నాను”
ఈ చిత్రానికి స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైందానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిశాంత్ భాగవత్ సినిమాటోగ్రఫీ అందించగా, మంగేష్ ధక్డే సంగీతం సమకూర్చారు. ఆశిష్ మాథ్రే ఎడిటింగ్, షకీల్ అజామీ సాహిత్యం, అన్మోల్ భావే సౌండ్ డిజైనర్.








