నాకంటే ఈ అవార్డులకు వారే అర్హులు
ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురిపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పరుష వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు సంబంధించి తీవ్రంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ తనకొచ్చిన ఐదు జాతీయ అవార్డుల గురిచి ప్రస్తావిస్తూ వీటికి ప్రధాని మోదీ సహా అర్హులైన పెద్ద నటులే ఉన్నారు. ఈ అవార్డులను నేను వారికి ఇచ్చేయాలా? అని అన్నారు. అయితే ఈ జాతీయ అవార్డులను తాను వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా ముందు వచ్చిన వార్తలను ఖండించిన ప్రకాష్రాజ్ తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. నా నాటనకు సంబంధించి వచ్చిన ఈ జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేసేంత మూర్ఖుడ్ని కాదు అని అన్నారు. గౌరీ లంకేష్ హత్య కేసు విషయంలో ఇంతవరకు ఎవర్నీ అరెస్టు చేయకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని అన్నారు. గౌరీ లంకేష్ హత్యకు సంబంధించి ప్రధాని మోదీ మౌనం తనకు మనస్తాపాన్ని, ఆవేదనను కలిగిస్తోందని అన్నారు. పలు తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రకాష్రాజ్ గౌరీ లంకేష్కు అత్యంత సన్నిహితుడైన మిత్రుడు కావడం గమనార్హం.













