గిరీష్ కర్నాడ్ ఇక లేరు
ప్రముఖ రంగస్థలనటుడు, రచయిత, గిరీష్ కర్నాడ్ (81) కన్ను మూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులో సోమవారం ఉదయం 6:30 గంటలకు మృతిచెందారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మధేరాలో ఆయన జన్మించారు. ఆనందభైరవి, శంకర్ దాబా ఎంబిబిఎస్, ధర్మచక్రం, రక్షకుడు వంటి పలు చిత్రాల్లో గిరీష్ నటించారు. 1998లో జ్ఞానపీఠ అవార్డును ఆయన అందుకున్నారు. వంశ వృక్షం అనే కన్నడ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు ఆయన్ని వరించాయి. కర్నాడ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కర్నాడ్ మృతి భారతీయ సాంస్కృతిక రంగానికి తీరని లోటని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. బహుభాషా నటుడిగా ఆయన సేవలు నిరుపమానమని, సామాజిక సమస్యలపై గొంతెత్తేవారని, భవిష్యత్ తరాలు ఆయన్ని గుర్తు చేసుకుంటాయని ప్రధాని తన ట్వీట్లో పేర్కొన్నారు. గిరీష్ కర్నాడ్ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్టు మోడీ ట్వీట్ చేశారు.













