ప్రజాస్వామ్యానికి శుభదినం : బైడెన్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. సెనెట్లో రిపబ్లికన్లు కేవలం ఒక్క అడుగు ఆధిక్యంలో ఉండటం, కాంగ్రెస్లో హోరా హోరీ పోరు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సవాళ్ల మధ్య డెమోక్రాట్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను ప్రజాస్వామ్యానికి శుభదినంగా అభివర్ణించారు. అదే సమయంలో ఓటర్లలో నైరాశ్యాన్ని అంగీకరించాడు. అమెరికాకు ఇది మంచిరోజుగా భావిస్తున్నానని అన్నారు. మెజారిటీ అమెరికన్లు తన ఆర్థిక ఎజెండాకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.
అధిక ద్రవ్యోల్బణంపై రిపబ్లికన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నారని తెలిపారు. ఓటర్లు తమ ఆందోళనల గురించి స్పష్టంగా చెప్పారు. ఇంకా చాలా మంది ప్రజలు బాధల్లో ఉన్నారు. వారు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను తమ పార్టీ పరిష్కరించగలదన్న విశ్వాసం ప్రజల్లో ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని బైడెన్ వ్యాఖ్యానించారు.






