అమెరికా ప్రతినిధుల సభలో.. అంబేద్కర్ గౌరవార్థం తీర్మానం
వాషింగ్టన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అమెరికాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అగ్రరాజ్యపు ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రోహ్ ఖన్నా.. అంబేద్కర్ గౌరవార్థం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన ఇలా తీర్మానం చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రపంచ దేశాల్లోని యువనేతలు అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గాన్ని చూసి స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా ఖన్నా చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఖన్నా.. “అంబేద్కర్ గౌరవార్థం ఆయన 130వ జయంతి సందర్భంగా ఇవాళ నేను మరోసారి తీర్మానం ప్రవేశపెడుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువనేతలు అంబేద్కర్ చూపించిన సమానత్వం మార్గం నుంచి ప్రేరణ పొందాలని ఆశిస్తున్నా. దళితుడైన అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా నేడు ఎంతో మంది భారతీయులు తమ హక్కులను కాపాడుకుంటున్నారు” అని తెలిపారు. అలాగే వైశాఖి పండుగ విశిష్టతను గుర్తించాలంటూ జాన్ గారమేండి అనే కాంగ్రెస్ సభ్యుడు ప్రతినిధుల సభలో మరో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ పండుగకు గల చారిత్రాత్మక, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను గౌరవించాలని గారమేండి కోరారు. అమెరికా చట్ట సభలో సిక్కు సామాజిక వర్గానికి జాన్ గారమేండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.






