ఆ బ్యాలెట్లను పక్కన పెట్టండి : అమెరికా కోర్టు
అమెరికా ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ పక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల తేది రోజున రాత్రి 8 గంటల తర్వాత వచ్చిన బ్యాలెట్లను లెక్కించరాదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సామ్యూల్ అలిటో ఆదేశించారు. చాలా ఆలస్యంగా పోలింగ్ సెంటర్లకు వచ్చిన ఓట్లను లెక్కపెట్టరాదంటూ పెన్సిల్వేనియాలో రిపబ్లికన్లు న్యాయపోరాటానికి దిగారు. నవంబర్ 3వ తేదీన బ్యాలెట్ను బట్వాడా చేసినట్లు పోస్టల్ స్టాంప్ ఉన్న బ్యాలెట్లను మరోచోట సమీకరిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల తేదీ రోజున పెన్సిల్వేనియాలో ట్రంప్ లీడింగ్లో ఉన్నారు. కానీ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో సీన్ మారింది. ప్రస్తుతం జో బైడెన్ ఆ రాష్ట్రంలో ఆధిక్యంలోకి వచ్చేశారు. సుమారు 22 వేల ఓట్ల మెజారిటీతో బైడెన్ దూసుకెళ్తున్నారు. అయితే అక్కడ రేసు ఇంకా రసవత్తరంగానే కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో ఇప్పుడే విజేతను అంచనా చేయడం అంత సులువు కాదు.






