ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ పిలుపు…

కరోనా మూలలపై పరిశోధనలు మరోసారి చైనా వైపు వేలు చూపిస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొవిడ్తో జరిగిన నష్టానికి చైనా నుంచి అమెరికా సహా ప్రపంచ దేశాలు పరిహారాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తర కరొలినా జీఓపీ కన్వెన్షన్లో మాట్లాడుతూ చైనా కచ్చితంగా పరిహారం చెల్లించాల్సిందేనన్నారు. కనీసం 10 ట్రిలియన్ (10 లక్షల కోట్ల) డాలర్లను చైనా పరిహారం కింద చెల్లించాలి. ఆ దేశం చేసిన నష్టం కంటే ఈ మొత్తం చాలా తక్కువ. ప్రపంచ దేశాలు చైనాకు ఇక ఏమాత్రం బాకీ లేవు. చైనానే ప్రపంచానికి బాకీ ఉంది. ఎన్నో దేశాలను అది నాశనం చేసింది. దానికి బాకీ ఉన్న దేశాలు తమ అప్పును, పరిహారం సొమ్ములో డౌన్పేమెంట్గా భావించి రద్దు చేసుకోవాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా చైనా వస్తువులన్నింటిపైనా అమెరికా 100 శాతం పన్నులు విధించాలనిన సూచించారు. దీంతో చైనా సైనిక సామర్థ్య పెంపునకు అడ్డుకట్ట వేయడమే కాక ఎన్నో కంపెనీలు తిరిగి అమెరికా వస్తాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను చైనా లెక్క చేయదని ఆయన వ్యాఖ్యానించారు. బైడెన్ ప్రభుత్వంపైనా ట్రంప్ ఈ సందర్భంగా పలు ఆరోపణలు చేశారు.