నాలుగేళ్లలో 30 వేలకుపైగా తప్పుడు ప్రకటనలు
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో డొనాల్డ్ ట్రంప్ 30,573 తప్పుడు ప్రకటనలు చేశారని వెల్లడించింది ప్రముఖ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్. తొలి రోజు నుంచే ప్రారంభమైన ఈ తప్పుడు ప్రకటనల జాబితా.. కాలం గడుస్తున్న కొద్దీ ముదిరిందని ఆ పత్రిక తెలిపింది. అంతేకాదు అత్యధికసార్లు టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన రికార్డును కూడా ట్రంప్ సొంతం చేసుకున్నారు. కరోనా మహమ్మారి ఒక అద్భుతంలాగా అలా వెళ్లిపోతుందని, అధ్యక్ష ఎన్నికలను దొంగిలించారని ట్రంప్ అమెరికా ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. గత పదేళ్లలో రెండు పార్టీల నేతల ప్రకటనల కచ్చితత్వాన్ని ఫ్యాక్ట్ చెకర్ అంచనా వేసిందని, ట్రంప్ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదని ఆ పత్రిక తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ తన తొలి ఏడాదిలో సగటున రోజుకు ఆరు తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, అది రెండో ఏడాదిలో 16కు, మూడో ఏడాదిలో 22కు, చివరి ఏడాదిలో 39కు చేరినట్లు ఫ్యాక్ట్ చెకర్ డేటా వెల్లడించింది. నాలుగేళ్లుగా ట్రంప్ చెప్పిన అబద్ధాల మీద అబద్ధాలు వినీ వినీ.. అమెరికా ప్రజలు చివరికి నిజాలపై సందేహాలు వ్యక్తం చేసే స్థితికి చేరుకున్నారని చరిత్రకారుడు మైకేల్ బెస్క్లాస్ తెలిపారు. వీటిలో సగం అబద్ధాలను అధ్యక్ష ర్యాలీల్లో లేదా రద్దయిన తన ట్విటర్ అకౌంట్ ద్వారా చెప్పినట్లు తేలింది. నవంబర్ 3న జరిగిన ఎన్నికల తర్వాత ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ 800 సార్లు తప్పుడు ప్రకటనలు చేశారట. అలాగే ఆర్థిక వ్యవస్థ గురించి, కరోనా వైరస్ గురించి, పన్నుల గురించి కూడా వేల సార్లు తప్పుడు ప్రకటనలు జారీ చేసినట్లు ఈ డాటా సృష్టం చేసింది.






