జో బైడెన్ కీలక నిర్ణయం… 31 కల్లా ముగించాల్సిందే
అఫ్ఘనిస్థాన్లో అమెరికా పౌరులు, అఫ్ఘన్ మిత్ర దేశాలకు చెందిన ప్రజలు ఖాళీ చేయించడానికి గడువును ఆగస్టు 31 తర్వాత పొడిగించరాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించినట్లు ప్రభుత్వంలో అధికారి ఒకరు తెలిపారు. తన జాతీయ భద్రతా బృందంతో చర్చించిన తర్వాత బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గడువును మించి అఫ్ఘన్లో అమెరికా బలగాలను ఉంచడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలన్నిటినీ బేరీజు వేసిన తర్వాత వచ్చే వారం నాటికే పౌరుల తరలింపు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ అధికారి చెప్పారు. ఈ నెల 15న తాలిబన్లు ఆఫ్ఘన్ను అధీనం చేసుకోవడానికి ముందు అక్కడినుంచి తన బలగాలను, పౌరులను పూర్తిగా తరలించడానికి బైడెన్ పెట్టుకున్న గడువు ఇదే కావడం గమనార్హం. ఒక వేళ ఈ గడువును కొద్దిగా పెంచాల్సి వస్తే కంటింజెన్సీ (తాత్కాలిక) ప్రణాళికలను సిద్ధం చేయాలని కూడా బైడెన్ తన జాతీయ భద్రతా బృందాన్ని ఆదేశించారని ఆ అధికారి తెలిపారు.






