అమెరికాలో అట్టహాసంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మిచిగాన్ చాప్టర్ ప్రారంభం…
అమెరికాలోని ప్రవాస భారతీయుల చరిత్రలో అత్యంత కీలకమైన , చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ విభాగానికి చెందిన మిచిగాన్ చాప్టర్ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం మిచిగాన్ రాష్ట్రం ఫార్మింగ్టన్ హిల్స్ ప్రాంతంలోని సెయింట్ టోమా హాల్ వేదికగా 2026 జూన్ 26 నాడు అత్యంత వైభవంగా, ఘనంగా జరిగింది. ఈ అపూర్వమైన చారిత్రక వేడుకకు సుమారు 700 మందికి పైగా ప్రవాస భారతీయ అతిథులు , ప్రతినిధులు విశేషంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు స్ఫూర్తిదాయకమైన అతిథుల ప్రసంగాలు , నూతన కార్యవర్గ అధికారిక ప్రకటనలతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా ఒక మరపురాని వేడుకలా సాగింది. బిల్డింగ్ బ్రిడ్జెస్ , ఎంపవరింగ్ కమ్యూనిటీస్ అనే ప్రధాన నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం…
ఈ భారీ ప్రారంభోత్సవ వేడుకకు ముందు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సన్నాహక కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ ప్రెసిడెంట్ మొహిందర్ సింగ్ గిల్జియాన్ , తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీధర్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ప్రవాస భారతీయుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కమ్యూనిటీ సమస్యలపై ఒక అర్థవంతమైన సంభాషణ కోసం, భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు సమావేశం చాలా ఉపయోగపడింది.
సాంస్కృతిక వైభవం…
భారతీయ సంప్రదాయంలో జ్ఞానానికి , వివేకానికి ప్రతీకగా భావించే పవిత్రమైన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సమావేశానికి హాజరైన అతిథులంతా లేచి నిలబడి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారత జాతీయ గీతాలాపన చేశారు. ప్రవాస భారతీయులకు తమ మాతృభూమిపై ఉన్న అపారమైన ప్రేమను అలాగే తాము నివసిస్తున్న అమెరికా దేశంపై ఉన్న నిబద్ధతను, ఈ రెండు దేశాలతో వారికి ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పారు.
అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్నారులు , మ్యూజిక్ డాన్స్ టీమ్ లీడ్స్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు అక్కడికి వచ్చిన వారందరినీ ఎంతగానో అలరించాయి. మిచిగాన్ రాష్ట్రంలోని భారత సమాజ వారసత్వాన్ని , వారి చైతన్యాన్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కళ్లకు కట్టాయి. విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ మాతృభూమి మూలాలను మరువకుండా భావితరాలకు మన కళలను, సంప్రదాయాలను అందించడంలో ప్రవాస భారతీయుల నిబద్ధత ఈ ప్రదర్శనల ద్వారా వ్యక్తమైంది.
ఇవి కూడా చదవండి
సీఎం రేవంత్ రెడ్డి తదితరుల సందేశాలు..
ఈ ప్రారంభోత్సవ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ ద్వారా వర్చువల్ సందేశాన్ని అందించారు. ప్రవాస భారతీయులు మాతృభూమితో తమ అనుబంధాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఆయనతో పాటు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, నార్త్ ఈస్ట్ రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ సమల , తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ఎన్నారైలకు మద్దతు అందించారు. వివిధ ప్రాంతాలకు, స్థాయిలకు చెందిన నాయకులు ఒకే వేదికపైకి రావడం ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను, పరిధిని మరింత పెంచింది.
డాక్టర్ శామ్ పిట్రోడా వర్చువల్ ప్రసంగం…
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ గ్లోబల్ చైర్మన్ డాక్టర్ శామ్ పిట్రోడా వర్చువల్ విధానంలో చేసిన కీలక ప్రసంగం కార్యక్రమానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సంస్థ ఆవశ్యకతను, ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రవాస భారతీయులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల స్థితిగతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో ప్రజాస్వామ్య పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రభావాలను చూపుతాయని ఆయన అన్నారు. సత్యం, నమ్మకం, ప్రేమ, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అందరినీ కలుపుకుపోయే తత్వం వంటి ప్రాథమిక ప్రజాస్వామ్య విలువలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎన్నారైలపై ఉందని ప్రజల శ్రేయస్సు కోసం ఇది అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నిరంకుశ పోకడల ప్రమాదాల గురించి ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా తప్పుడు సమాచారం, సోషల్ మీడియా సృష్టిస్తున్న ఎకో ఛాంబర్స్ కారణంగా ప్రజల మధ్య నమ్మకం ఎలా సన్నగిల్లుతోందో ఆయన వివరించారు. కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే రాజకీయ ప్రక్రియలో ఒక భాగమని కేవలం అధికార దాహం వెనుక పరిగెత్తకుండా ప్రాథమిక విలువలను కాపాడుకోవడంపైనే ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1964లో తాను తొలిసారిగా అమెరికా గడ్డపై అడుగుపెట్టినప్పుడు ఇక్కడ వందల సంఖ్యలో మాత్రమే ఉన్న భారతీయులు ఇవాళ మిలియన్ల సంఖ్యకు చేరుకుని అమెరికాలో అత్యంత విజయవంతమైన కమ్యూనిటీగా ఎదగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారతదేశానికి సరైన దృక్పథాన్ని వ్యాప్తి చేయడానికి , మాతృభూమితో బలమైన సంబంధాలను నిరంతరం కొనసాగించడానికి ప్రవాస భారతీయులు ఒక వారధిలాగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలలో చురుకుగా పనిచేస్తోందని తెలిపారు. కనెక్టివిటీ పెంపొందించడం, రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశానికి, ముఖ్యంగా అమెరికా వంటి ఇతర దేశాలకు మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సంస్థ ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు.

వ్యూహాత్మక లక్ష్యాలు…
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ యూఎస్ఏ అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ భవిష్యత్తు కార్యాచరణను , వ్యూహాత్మక లక్ష్యాలను సభ ముందుంచారు. 2026 డిసెంబర్ నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యాప్తంగా 100 బలమైన , శక్తివంతమైన స్థానిక చాప్టర్లను ఏర్పాటు చేయాలని సంస్థ స్పష్టమైన లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. వంద మంది బలమైన నాయకులను సమీకరించడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ మిచిగాన్ చాప్టర్ ప్రారంభోత్సవం అనేది సంస్థ విస్తృతమైన విస్తరణ ప్రణాళికలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా వ్యాప్తంగా హ్యూస్టన్, ఫ్లోరిడా , కనెక్టికట్ ప్రాంతాలతో సహా మొత్తం 9 ఇతర చాప్టర్లను ఏకకాలంలో ప్రారంభించినట్లు నిర్వాహకులు సభలో వెల్లడించారు. సామాన్యుడికి మద్దతుగా నిలవడం ద్వారా మరింత బలమైన, ఐక్యమైన ప్రవాస భారతీయ సమాజాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను గిల్జియాన్ నొక్కి చెప్పారు.
ఈ వేదికపై మిచిగాన్ చాప్టర్ నూతన నాయకత్వ బృందానికి నియామక పత్రాలను ఘనంగా అందజేశారు. మిచిగాన్ చాప్టర్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీధర్ పటేల్కి నాయకులు అభినందనలు తెలిపారు. ఈ వేడుకను శ్రీధర్ పటేల్, ఆయన బృందం అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది. సంస్థ యూఎస్ఏ ప్రెసిడెంట్ మొహిందర్ సింగ్ గిల్జియాన్ , జార్జ్ అబ్రహం జాన్ జోసెఫ్ వంటి ఇతర జాతీయ స్థాయి నాయకుల సమక్షంలో ఈ నియామక ప్రక్రియ ముగిసింది. శ్రీధర్ పటేల్ ముందుచూపు , అంకితభావం కింద మిచిగాన్ చాప్టర్ సరికొత్త విజయ శిఖరాలకు చేరుకుంటుందని కమ్యూనిటీలో తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రతినిధులు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆయన మార్గదర్శకత్వంలో చాప్టర్ ఎన్నో మైలురాళ్లను చేరుకుంటుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కమ్యూనిటీ ప్రాముఖ్యత….
ఈ నూతన చాప్టర్ ఏర్పాటు కేవలం పరిపాలనాపరమైన విభాగం మాత్రమే కాదని ఇది ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే ఒక ముఖ్యమైన కనెక్టింగ్ నెట్వర్క్ అని వక్తలు స్పష్టం చేశారు. ప్రవాస భారతీయులను వారి మూలాలతో అనుసంధానం చేయడం , భారత్ లోని రాజకీయ ప్రసంగాలకు వారిని కనెక్ట్ చేయడం ఈ సంస్థ ప్రథమ కర్తవ్యం. వ్యాపారవేత్తలకు ఆంత్రప్రెన్యూర్లకు , వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తులకు అండగా నిలిచి మద్దతును అందించడం అలాగే విస్తృతమైన అమెరికన్ కమ్యూనిటీతో మమేకం అవ్వడం ద్వారా సామాజిక , రాజకీయ పరిణామాలను ప్రభావితం చేయడం ఈ చాప్టర్ ప్రధాన ఉద్దేశాలు.
సంస్థ వైస్ చైర్మన్ జార్జ్ అబ్రహం తన ప్రసంగంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సుదీర్ఘమైన , చారిత్రక ప్రాముఖ్యతను గుర్తుచేశారు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రస్తుత తరుణం అత్యంత కీలకమైనదని ఆయన నొక్కి చెప్పారు. ఈ చారిత్రక సమయంలో ప్రవాస భారతీయులంతా చురుకుగా రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని భారతదేశంలో ఉన్న తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను మంచి దిశగా ప్రభావితం చేయాలని ఆయన తీవ్రంగా పిలుపునిచ్చారు.
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్నారని వారంతా సమష్టిగా ఉంటే రాజకీయంగా, సామాజికంగా అపారమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం వారికి ఉందని నాయకులు విశ్లేషించారు. సరైన సమాచారాన్ని పంచుకోవడం , నెట్వర్కింగ్ పెంపొందించడం ద్వారా ప్రవాస భారతీయులకు , వారి మాతృభూమికి ప్రయోజనం చేకూర్చేలా ఈ ప్రభావాన్ని సక్రమంగా సమీకరించడమే ప్రధాన లక్ష్యమని వారు అన్నారు.
సమాజం కోసం కృషి చేసే శక్తిగా ఎదగాలని…
అన్ని పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చి మరింత బలమైన, సమ్మిళిత కమ్యూనిటీని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సమాజం కోసం శక్తిగా ఎదగాలని పిలుపునిస్తూ ఈ చారిత్రక కార్యక్రమాన్ని ముగించారు.








