చెన్నమనేని పౌరసత్వంపై.. హైకోర్టులో విచారణ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు ఆయన తెలిపారు. చెన్నమనేని కౌంటర్పై వివరణకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు రెండు వారాలు గడువు ఇచ్చింది. మరోసారి గడువు కోరవద్దని, తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు విచారణను న్యాయస్థానం రెండు వారాలు వాయిదా వేసింది.
చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది.