తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు…

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ‘‘గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ.437 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలని అంశాలను తప్పక నెరవేరుస్తాం. క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్కు ఒక్కొక్కరికీ 600 గజాల చొప్పున హైదరాబాద్లో ఇంటి స్థలం, నిఖత్ జరీన్, సిరాజ్కు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.
విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్కు మళ్లీ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించామన్నారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి.. కోదండరాంరెడ్డి, అమీర్ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్కు పంపిస్తాం. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు, హైదరాబాద్లో మూసీ సుందరీకరణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తాం’’ అని మంత్రి పొంగులేటి తెలిపారు.