మృగరాజులకు కరోనా…

కరోనా మహమ్మారి మనుషులనే కాదు…జంతువులను కూడా కష్టాల్లో పడేస్తోంది. మన దేశంలో తొలిసారిగా కరోనా జంతువులకు సోకింది. హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోని ఎనిమిది ఆసియా సింహాలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సింహాల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జూ అధికారులు తెలిపారు. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు. ఎనిమిది సింహాలకు సంబంధించిన కొవిడ్ పరీక్షల నివేదికలు మంగళవారం మధ్యాహ్నం వచ్చినట్లు జూ అధికారులు పేర్కొన్నారు. పార్క్లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. దీంతో వాటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపారు. సఫారీ ప్రాంతం 40 ఎకరాలు ఉండగా.. ఇందులో పది సంవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు కరోనా మహమ్మారి బారిన పడ్డాయి. దేశంలో పెరుగుతున్న కరోనా పెరుగుదల నేపథ్యంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నెల 2న నెహ్రూ జూ ప్కార్తో పాటు పలు పార్క్లను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే.