దేశమే కాదు.. ప్రపంచమంతా తెలంగాణ వైపు : డీకే శివకుమార్
బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో తాను తిరిగానని, ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలు దేశానికి కవలపిల్లలని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ అధినేతే చంద్రబాబు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి చేశారన్నారు. దేశమే కాదు, ప్రపంచమంతా తెలంగాణ ఎన్నికల వైపు చూస్తోంది. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి ప్రజలు గిఫ్ట్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాలు ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారు అని తెలిపారు.
కర్ణాటకలో మా పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. కర్ణాటక విషయాలు తెలుసుకోవాలని కేసీఆర్, కేటీఆర్కి విజ్ఞప్తి చేస్తున్నా. అరగంటలో మా రాష్ట్రానికి వచ్చి అమలవుతున్న పథకాల గురించి తెలుసుకోవచ్చు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలవుతున్నాయి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. ఇక్కడ డిసెంబర్ 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మాది జాతీయ పార్టీ. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అవసరం ఉంటుంది. ఆయా రాష్ట్రాల ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు ఉంటాయి. కర్ణాటకలో రైతులకు ఉచిత విద్యుత్ ప్రారంభమైంది. తెలంగాణతో పోలిస్తే మాది పెద్ద రాష్ట్రం. కరెంట్ విషయంలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాం. వేరే పార్టీలు ఎమోషన్స్తో పాలిటిక్స్ చేస్తాయి. కాంగ్రెస్ మాత్రం ప్రజల జీవితాలను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. తెలంగాణ సీఎం అభ్యర్థి విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు.













