21న ఉప రాష్టప్రతికి సన్మానం
భారత ఉప రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎం వెంకయ్యనాయుడుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించనున్న పౌర సన్మానం ఏర్పాట్లను గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ వివరించారు. ఉప రాష్టప్రతి పర్యటనపై వివిధ శాఖల అధికారులతో సిఎస్ సమావేశమయ్యారు. ఉప రాష్టప్రతి పర్యటన సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత, రహదారుల మరమ్మత్తులు, విద్యుత్, మంచినీటి సరఫరా, బేగంపేట ఎయిర్ పోర్ట్లో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సిఎస్ పలు సూచనలు చేశారు. ఈనెల 21న ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టులో ఉప రాష్టప్రతికి స్వాగత కార్యక్రమం, ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకుంటారని సిఎస్ వివరించారు. రాజ్భవన్లో ఘనంగా నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానుండటంతో ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలని సిఎస్ ఆదేశించారు. పౌర సన్మానం అనంతరం దిల్ఖుష్ అతిథి గృహంలో విందు కార్యక్రమం ఉంటుందని, అక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ సూచించారు.













