పోలీస్ శాఖలో పోస్టులు పెంచాలి.. మంత్రి నారా లోకేష్కు నిరుద్యోగ యువత వినతి
కాకినాడ రూరల్:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల సంఖ్యను మరింత పెంచాలని కోరుతూ పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న తమకు మరిన్ని అవకాశాలు కల్పించాలని వారు మంత్రిని కోరారు.
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగానే పోలీస్ రిక్రూట్మెంట్ను ప్రకటించామని చెప్పారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించి, వారికి బంగారు భవిష్యత్ అందించడమే తమ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వరుసగా భర్తీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగాల పోస్టుల సంఖ్య పెంచాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని నారా లోకేష్ వారికి భరోసా ఇచ్చారు.ప్రతి ఏడాది క్రమ పద్ధతిలో పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపారు. ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.








