శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, విష్వక్సేనుల వారికి అర్చకులు విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై, ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలవిరాట్కు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహించారు.






