ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జనాభా నియంత్రణ కాకుండా జనాభా సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులోనే ‘పిల్లలే సంపద’ అనే మాటను నిజం చేసి చూపుతామని సీఎం అన్నారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు పనిచేశాయని దీని కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారిని అనర్హులు చేస్తూ నిబంధనలు కూడా తెచ్చామని… ప్రస్తుతం పరిస్థితులు మారాయని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు విధానాలను మార్చుకోవాల్సిన తరుణం వచ్చేసిందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఫెర్టిలిటీ రేట్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని… భవిష్యత్తులో జనంతోనే అభివృద్ధి, జనాభా ఉంటేనే భవిష్యత్తుగా పరిస్థితులు మారతాయని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా దేశాల్లో జనాభా తగ్గిపోతోందని ఆయన అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”పిల్లలే సంపద కార్యక్రమానికి ఇవాల్టి నుంచే నాంది పలకాలని భావిస్తున్నాం.
దేశమంటే మట్టి కాదోయ్-దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన మాటల్ని మరో మారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. జనాభా నియంత్రణ కాదు జనాభా సంరక్షణ కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపడుతుంది. గతంలో జనాభా నియంత్రణపై ఆలోచన చేశాం. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టాయి. మహిళల్లో అక్షరాస్యత పెరిగితేనే జనాభా నియంత్రణ సాధ్యమని అప్పట్లో ఆలోచన చేశాం. స్థానిక సంస్థల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత అనే నిబంధనలు కూడా పెట్టాం. ఒక్కరు ముద్దు, ఇద్దరితో సరి, ముగ్గురు వద్దు అనే లాంటి ప్రచారాలు కూడా చేశాం. 20 ఏళ్ల క్రితం ఐటీ లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని సంపద సృష్టించాం. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. జనాభా నిర్వహణ గురించి కూడా చర్చిస్తున్నాం. ఆడబిడ్డల్ని చదివిస్తేనే కుటుంబానికి ఆస్తి, గతంలో వరకట్నం ఉండేది ఇప్పుడు ఎదురు కట్నం అనే పరిస్థితి వచ్చింది. అందుకే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. టోటల్ ఫెర్టిలిటీ రేటు మన రాష్ట్రంలోనూ పెరగాల్సి ఉంది. ఎలాంటి అభివృద్ధి అయినా జనాభా ఉంటేనే అది సార్ధకం అవుతుంది.” అని ముఖ్యమంత్రి అన్నారు.
అభివృద్ధి కోసం జనాభా నిర్వహణ కీలకం
“మైక్రో ఫ్యామిలీల గురించి యువత ఆలోచన చేయటం ప్రమాదకరం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. భారత్ లో దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి కూడా అదే. మన అభివృద్ధి సంతులనం కావాలంటే జనాభా నిర్వహణ చాలా కీలకం. అంగన్వాడీలు, పాఠశాలల్లోనూ చిన్నారుల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ప్రతీ వంద మంది జనాభాలో 89శాతం మందికి రెండో సంతానం లేదు. ఏపీలోని విశాఖ లాంటి జిల్లాల్లోనూ ఫెర్టిలిటీ రేటు అతి తక్కువగా ఉంది. ఏపీ విస్తీర్ణంలో 7 స్థానంలో ఉన్నా పాపులేషన్ డెన్సిటీలో దిగువన ఉన్నాం. పిల్లలే మన రాష్ట్ర సంపద. వారితోనే ఆర్ధిక ప్రగతి. సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఆర్ధిక ప్రగతి సాధించేలా రాష్ట్రంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నాం. పీ4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతున్నాం.
అభివృద్ధి ప్రాజెక్టులు కూడా సమతూకంలో జరగాలనే అన్ని ప్రాంతాలకూ పరిశ్రమలు, ప్రాజెక్టులు వచ్చేలా చూస్తున్నాం. ఆర్ధిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. జనాభా సంరక్షణ అనేదే ఈ సమయంలో కీలకం. జనాభా పెంచాలని మాట్లాడితే విమర్శలు వచ్చాయి. పిల్లలను పెంచటం అనేది కేవలం మహిళలు ఒక్కరిదే బాధ్యత మాత్రమే కాదు అది ఉమ్మడి బాధ్యత. కాన్పుల్లో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గాలి. మహిళల ఆరోగ్య రక్షణ అత్యంత కీలకం. జనాభా నిర్వహణ ఇక ఓ వాస్తవిక అంశం అని గుర్తించాలి. సంతానం వద్దనుకునే దంపతులు పెరగటం దురదృష్టకరం. మైక్రో ఫ్యామిలీలు వద్దు- భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ప్రపంచానికి ఆదర్శం. పిల్లలే సంపద- ఉమ్మడి కుటుంబమే శ్రీరామ రక్ష ” అని ముఖ్యమంత్రి వివరించారు.
సామాజిక మాధ్యమాలతో మానసిక సమస్యలు
“ఇవాళ తెలంగాణాలో జరిగిన ఘటన అత్యంత బాధాకరం. పోక్సో కేసులో ఉన్న నిందితుడు తనపై కేసు పెట్టిన వారి కుటుంబంలో 6 గురిని హత్య చేశాడు. అత్యంత దారుణమైన ఘటన ఇది. సామాజిక మాధ్యమాలు బాధ్యతారహితంగా వినియోగించటం, అసభ్యకరమైన, హింసాత్మక దృశ్యాల కారణంగా మానసిక సంతులన కోల్పోతున్నారు. విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వ్యసనంగా మారితే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. టెక్నాలజీ- స్పిర్చువాలిటీ ద్వారా యువతకు ప్రపంచాన్ని జయించే శక్తి సొంతం అవుతుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం చేపట్టాం. యువతతో పాటు వృద్ధులు సమాజానికి ఆస్తిగా తయారు కావాలి. త్వరలో ప్రభుత్వం వృద్ధుల కోసం క్షేమం అనే కార్యక్రమాన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. నిరంతరం నైపుణ్యాలను అందిపుచ్చు కుంటేనే అత్యుత్తమ మానవ వనురులు దేశానికి అందుతాయి.
టెక్నాలజీ- నాలెడ్జి ఉన్నా దేశంలో చాలా రంగాల్లో నాయకత్వ లేమి ఉంది. అంగన్వాడీల నుంచే పిల్లల ఆరోగ్యంతో పాటు పౌష్టిక ఆహారం అందిస్తున్నాం. పాఠశాలల్లో విద్య అందించేందుకు తల్లికి వందనం కింద ప్రతీ ఒక్కరికీ రూ.15వేల చొప్పున ఇస్తున్నాం. 2047 నాటికి మన తలసరి ఆదాయం రూ.55 లక్షలకు చేర్చాలన్నదే నా సంకల్పం. జనాభా లేకపోతే మనం చేసుకున్న అభివృద్ధి లక్ష్యాలను సాధించలేం. 2040కే స్వర్ణాంధ్ర సాధించే సత్తామనకుంది.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనంతరం పాపులేషన్ మేనేజ్మెంట్ ఫ్రేమ్ వర్క్ డాక్యుమెంటేషన్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ రావు, వైద్యారోగ్యం కుటంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీషా తదితరులు హాజరయ్యారు.








