తీర్పు వెల్లడించే వరకు ఆయనను అరెస్టు చేయొద్దు : హైకోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అవినాష్ విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సీబీఐ అందించింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలను కోర్టు సమర్పించింది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్ పాత్ర ఉందని ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెల్లడించే వరకు అవినాష్ను అరెస్టు చేయొద్దని సీబీఐను ఆదేశిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. భాస్కర్రెడ్డిని విచారణ అంశం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. విచారణ హైదరాబాద్ బదిలీ అయితే కడపకు ఎందుకు పిలిచారని ప్రశ్నించింది. కడపలో విచారణకు తాము పిలవలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు సీబీఐ ఆఫీసు వద్ద అవినాష్ ప్రెస్మీట్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఏంటని ప్రశ్నించింది.













