సలహాదారుల నియామకంపై.. ఏపీ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ నియామకాలపైనా దాఖలైన వేర్వేరు పిటిషన్లపై కలిపి ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. నిష్ణాతులైన వారినే సలహాదారులుగా నియమిస్తున్నామని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తుది నిర్ణయానికి ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మెరిట్స్పై వాదనలు వినిపిస్తామని ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అని ప్రశ్నించింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని వ్యాఖ్యానించింది.













